Skip to main content

Namaste NRI

అమెరికాలో ఘోరం: హైదరాబాద్ కుటుంబం సజీవదహనం

హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం అమెరికాలో సజీవ దహనమైంది. వారం రోజులపాటు సెలవులను ఆనందంగా గడపటం కోసం బంధువుల ఇంటికి వెళ్లిన నలుగురు హైదరాబాదీలు దారుణ ప్రమాదానికి గురయ్యారు. శ్రీ వెంకట్‌(40),  ఆయన భార్య తేజస్విని(36),  వారి ఇద్దరు పిల్లలు సిద్ధార్థ (9), మదా(7)తో  కలిసి  కారులో వెళ్తుండగా, అట్లాంటా-డాలస్‌ మార్గంలో, గ్రీన్‌ కౌంటీ వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ మినీ ట్రక్కు ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో వీరంతా కారులో సజీవ దహనమయ్యారు. శ్రీవేంకట్‌ స్వస్థలం హైదరాబాద్‌లోని కొంపల్లి. వీరు తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది.

హైదరాబాద్‌లోని వీరి బంధువులకు అమెరికా పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. మినీ ట్రక్కు రాంగ్‌ రూట్‌లో వచ్చినట్లు పోలీసులు నిర్థరించారు. కారు పూర్తిగా కాలిపోవడంతో మృతుల ఎముకలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించి, డీఎన్‌ఏ శాంపిల్స్‌ను సేకరించి, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం. ప్రమాద ఘటన పై శ్రీ వెంకట్‌, తేజస్విని కుటంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2013లో శ్రీవెంకట్‌, తేజస్వినికి వివాహమైంది. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

Social Share Spread Message

Latest News