తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శుష్ముణ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందన్నారు. ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్నారు. వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పురుషుల కన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని పేర్కొన్నారు. స్థానికంగా మన స్వదేశం నుండి వచ్చిన మహిళలు, అమ్మాయిలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారికి అన్ని విధాలా అండగా
ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ వేడుకలను విజయవంతం చెయ్యడానికి కొన్ని వారాల నుండి కష్టపడి పని చేసిన టాక్ మహిళా నాయకులు జాహ్ణవి దూసరి, విజితా రెడ్డి, శైలజ జెల్లా, స్నేహ నవాపేట్, సృజనా, శ్వేతాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి, మహిళా సెల్ ఇన్ఛార్జ్ విజిత రెడ్డి దుగ్గంపుడి, మహిళా సెల్ కార్యదర్శి క్రాంతి రెటినేని, శైలజ జెల్లా, శ్రావ్య, స్నేహ, విద్యా పవిత్ర, స్వాతి, శ్వేతా మహేందర్, సృజనా,తదితరులు పాల్గొన్నారు.














