Namaste NRI

వాషింగ్టన్ డీసీలో ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ డీసీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు సుధీర్ కొమ్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీచైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ  బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. సామాన్యుడు, అసామాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించారు. ఆయన చరిత్ర చెరిపేద్దామన్నా చెరిగిపోదు. పేరు తొలగించినా జనం మనస్సులో, మదిలో నుంచి ఆయన రూపును తుడిపివేయలేరు. తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో నందమూరి చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది అని మన్నవ స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం తెలుగుజాతి గుండెల్లో జాతీయగీతంలా మారుమోగిందనీ, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని సాయి బొల్లినేని అభిప్రాయపడ్డారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందారని కిషోర్ కంచెర్ల గుర్తు చేశారు. తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారనీ, రాముడు, కృష్ణుడంటే ఎన్టీఆర్ రూపే గుర్తుకు వస్తుందని అని అన్నారు.

Social Share Spread Message

Latest News