ఇరాక్లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న అమెరికా సైనిక ఉనికికి త్వరలోనే ముగింపు పడనుంది. అక్కడ మోహరించిన వందలాది మంది అమెరికా సైనికులను పూర్తిగా వెనక్కి పిలిపించనున్నట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్లో ఇరాక్ ప్రధానమంత్రి అలీ అల్-జైదీతో భేటీ అయిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య బంధం ఇకపై సైనిక రక్షణ వ్యూహాల నుంచి వాణిజ్యం, పెట్టుబడులు, చమురు రంగాల వైపుగా సరికొత్త మలుపు తిరగనుందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమెరికా రక్షణ దళాలు ఇరాక్ను పూర్తిగా వీడి వెళ్లనున్నాయని ఇరాక్ ప్రధాని కూడా స్పష్టం చేశారు.

ఇరాక్లో ఇకపై తమ మిలిటరీ బలగాల అవసరం లేదని భావిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, సైన్యం నిష్క్రమించినప్పటికీ ఆర్థిక బంధం మరింత బలోపేతం కానుందని చెప్పారు. అమెరికాకు చెందిన ప్రముఖ చమురు సంస్థలు ఇరాక్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇప్పటికే స్థానిక సంస్థలతో భాగస్వామ్యాలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ వారం లేదా వచ్చే వారంలో చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందాలను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ట్రంప్ హింట్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఇరాక్కు రక్షణ సహాయం అందిస్తామని, కానీ ప్రస్తుతం ఆ అవసరం రాకపోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.






























