యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఇకపై తమ దేశంలో వారానికి నాలుగున్నర రోజులే పనిదినాలని ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, విభాగాలన్నీ ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో నాలుగున్నర రోజుల పని విధానాన్ని పాటిస్తున్న తొలి దేశం తమదేనని అక్కడి అధికారులు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో వీకెండ్ అంటే శుక్ర శనివారాలే. ప్రపంచంలో మిగిలిన దేశాల్లో శని, ఆదివారాల్లో ప్రజలు వీకెండ్ సెలవు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈ కూడా ఇతర దేశాలను అనుసరిస్తూ కొత్త పద్ధతిని అవలంభించేందుకు నిర్ణయించింది. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టించింది.














