ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత స్వరనిధి స్వర వీణాపాణికి విశ్వ విజయోత్సవ సభ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు, సంగీత సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. తానా కౌన్సిలర్-ఎట్-లార్జ్ ప్రతినిధి లోకేష్ నాయుడు సభ్యులు అందరికి స్వాగతం పలికి , సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలియజేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత స్వరనిధి స్వర వీణాపాణి గారికి అభినందనలు తెలిపి సభను ప్రారంభించారు. తానా కళాశాల చైర్మన్ రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ కళాశాల ప్రారంభం నుంచి ఎంతోమంది నృత్య కళాకారులకు, కూచిపూడి నృత్యంలో పట్టభద్రులు అవ్వడానికి సహకారం అందించడంతో పాటు మన్ముందు ఆసక్తి గల విద్యార్థులకు ప్రోత్సాహం వుంటుంది అని అన్నారు. సంగీత గురువులు అయిన సమీరా శ్రీపాద విఘ్నేశ్వర స్తుతి ప్రార్ధనా గీతంతో సభను ప్రారంభించారు.
డాక్టర్ ప్రసాద్ తోటకూరను మాట్లాడుతూ భారత తెలుగు సినిమా పాటకు ఆస్కారు అవార్డు రావడం భారతీయులు అందరికీ గర్వకారణం అనీ, గీత రచయిత, సంగీత దర్శకుడు, చిత్ర దర్శకులు, నిర్మాత, నృత్య దర్శకులకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా మనమధ్యలో నాకు అత్యంత సన్నిహిత మిత్రులు 2013 నుంచి పరిచయమై, ఎన్నో చలనచిత్రాలకు సంగీత దర్శకులుగా, గీత రచయితగా అద్భుతాలు సృష్టించి, అత్యంత ప్రతిభతో, అత్యంత తక్కవ సమయంలో 72 మేళకర్త రాగాల స్వరూపం మొత్తాన్ని ఒక సంక్షిప్త కీర్తనలో పొందుపరచి, 61 గంటలపైగా పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును సొంతం చేసుకున్న స్వరవీణాపాణిని సభకు పరిచయం చేసి, కరతాళ ధ్వనులమధ్య వేదిక పైకి ఆహ్వానించారు. వీణాపాణి గిన్నీస్ రికార్డు అందుకోవడం, తెలుగు జాతికి గర్వకారణం అని, సంగీత ప్రపంచం మొత్తం 72 మేళకర్త రాగాలలోనే నిబిడీకృతమై ఉంటుందని గుర్తు చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/1_3b3464d658_V_jpg-799x414-3g-1.jpg)
ముఖ్య అతిథి స్వర వీణాపాణి మాట్లాడుతూ తనకు డా. ప్రసాద్ తోటకూరని, తనికెళ్ళ భరణి పరిచయం చేశారని, తరువాత వారితో అనుబంధం జీవితంలో మరువలేనిది అని అన్నారు. అలాగే వెన్నం ఫౌండేషన్ అధినేత మురళీ వెన్నం, డా. ప్రసాద్ తోటకూర కలసి తనకు వారు ఇచ్చిన ప్రోత్సాహం, ఆదరాభిమానాలు తనను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డును అందుకునే వరకు కొనసాగాయని అన్నారు. వారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత గా వారి ప్రస్థానం, అనుభవాలను సంగీత, సాహిత్య ప్రియులతో పంచుకొని, అందరి ఆదరాభిమానాలను పొందారు. తరువాత లండన్ లో గిన్నిస్ రికార్డ్ల పర్యవేక్షణ అధికారిక బృందం దగ్గర ఆలపించిన స్వర గాంధీజీ -72 మేళకర్తాల రాగాలను మరియు స్వర కామాక్షి, స్వర బీజాక్షి కీర్తనలను వీనుల విందుగా ఆలపిస్తూ , తన సంగీత ప్రతిభతో అందరినీ మంత్రముగ్దులను చేశారు, వారికి తబలా సహకార వాయిద్యాన్ని అందించిన శ్రీనివాస్ ఇయ్యున్నినీ ప్రత్యేకంగా అభినందించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/4_f85341057f-1024x576.jpg)
తరువాత డా. ప్రసాద్ తోటకూర మరియు మురళీ వెన్నం చేతులు మీదుగా, వారికి కృతజ్ఞతగా పూర్వక అభిమానంతో మరియొక సారి తను లండన్లో అందుకున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డును అందుకున్నారు.తానా మరియు టాంటెక్స్ అధికార బృందం స్వరవీణాపాణి గారిని శాలువ మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో లోకేష్ నాయుడు, మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, అశోక్ కొల్లా, చినసత్యం వీర్నపు, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. భానుమతి ఇవటూరి , లక్ష్మి పాలేటి, శరత్ యర్రం (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల,సుందరరావు బీరం, బాపూజీ జంధ్యాల పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-52.jpg)