దక్షిణాసియా నుంచి మోసపూరిత దరఖాస్తులు ఎక్కువ అవుతుండటంతో ఆస్ట్రేలియాకు చెందిన ఐదు విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులపై నిబంధనల్ని విధించాయి. 2019లో ఆస్ట్రేలియాలో 75వేల మంది భారత విద్యార్థులు విద్యాభ్యాసానికి వచ్చారు. వాటిలో చాలా తప్పుడు దరఖాస్తులు ఉన్నాయి. ఈ ఏడాది కూడా భారీగా తప్పుడు దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో విక్టోరియా, ఎడిత్ కొవాన్, వొలొంగాంగ్, టోరెన్స్, సదరన్ క్రాస్ యూనివర్సిటీలు భారత విద్యార్థులపై నిబంధనల్ని ప్రకటించాయి. కొన్ని వర్సిటీలు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల విద్యార్థులపై నిబంధనల్ని విధించాయి. పెర్త్లోని ఎడిత్ కొవాన్ వర్సిటీ పంజాబ్, హరియాణ విద్యార్థులను నిషేధించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ సహా ఎనిమిది రాష్ట్రాల విద్యార్థులపై విక్టోరియా యూనివర్సిటీ నిబంధనల్ని విధించింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, లెబనాన్, మంగోలియా, నైజీరియా తదితర దేశాల విద్యార్థులపై యూనివర్సిటీ ఆఫ్ వొలొంగాంగ్ నిబంధనల్ని కఠినతరం చేసింది.

















