సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి సినిమా విరూపాక్ష. సంయుక్త మీనన్ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుకుమార్ స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ దండు రూపొందించారు. తెలుగులో విజయం సాధించిన ఈ సినిమాను ఈ నెల 5న హిందీ, తమిళ, మలయాళంలో, 12న కన్నడలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ మా సినిమాకు పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మా సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్కి థాంక్స్. ఇతర భాషల్లోనూ మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ మళ్లీ మళ్లీ మా సినిమాను చూస్తున్నామని ప్రేక్షకులు చెప్పడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఇచ్చిన అనుభూతి మర్చిపోక ముందే విరూపాక్ష 2 సినిమాను ప్రకటించబోతున్నాం అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ సంస్థ నుంచి కార్తీక్ దండు రూపంలో మరో ప్రతిభ గల దర్శకుడు పరిశ్రమకు దక్కాడు. సాయిధరమ్ తేజ్కు పునర్జన్మ లాంటి చిత్రమిది. ఆయనతో మూడు సినిమాలు నిర్మించాను. కానీ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని త్వరలో మా కాంబినేషన్ మూవీ ఎలా ఉండాలి అనే లక్ష్యాన్ని నిర్ణయించింది అన్నారు. హీరోయిన్ సంయుక్తా మీనన్ మాట్లాడుతూ విరూపాక్ష సినిమా రిలీజైన రోజు నుంచి సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విరూపాక్ష మే 5 నుంచి ఇతర భాషల్లోనూ రిలీజ్ కానుంది. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యి అద్బుతాలు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నాం. డైరెక్టర్ కార్తీక్, నిర్మాతలకు థాంక్స్ అన్నారు.















