భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికాలో నేషనల్ డే ఆఫ్ సెలబ్రేషన్ గా ప్రకటించాలంటూ భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ తానేదార్ నేతృత్వంలోని పలువురు అమెరికా చట్టసభ్యులు ప్రతినిధుల సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ సభ్యులు బడ్డీ కార్టర్, బ్రాడ్ షర్మాన్ సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. ఆగస్టు 15వ తేదీని ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో సంబరాల రోజుగా మార్చాలని వారు కోరారు.
ఇరుదేశాలు పంచుకొనే ప్రజాస్వామ్య విలువలే బంధానికి, భాగస్వామ్యానికి మూలమని అమెరికా కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. జూన్లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ తీర్మానానికి బీజం పడినట్లు తెలిసింది. అధికార దేశ పర్యటనతో ఇరుదేశాల మధ్య విశ్వాసం, పరస్పర అవగాహన, చట్ట పాలన, మానవహక్కులను గౌరవించడం వంటి అంశాలపై అవగాహన పెరిగిందని తీర్మానంలో వెల్లడించారు. భారతీయులతో కలిసి ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి తీర్మానం ఉపయోగపడుతుందని వెల్లడించారు.














