ఎన్ఆర్ఐ టీడీపీ ఐర్లాండ్ విభాగంలో ఆధ్వర్యంలో మేథోమథన సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడంలో ఎన్ఆర్ఐల పాత్ర గురించి చర్చించారు. ముఖ్య అతిథిగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధిపతి రవి వేమూరు మాట్లాడుతూ యూరప్ వ్యాప్తంగా ఎన్ఆర్ఐ టీడీపీని బలోపేతం చేయటం, ఎన్ఆర్ఐ సేవలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఎలా వినియోగించుకోబోతుందనే విషయాలను గురించి వివరించారు. పార్టీలో ఎన్ఆర్ఐల పాత్రతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని వివరించారు.
డాక్టర్ కిషోర్ బాబు చలసాని మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ఐర్లాండ్ బృందం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. యూరప్ దేశాలైన ఐర్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, బెల్జియం, స్వీడన్, మాల్టా, ఇటలీ, ఫిన్లాండ్, హంగేరి తదితర మిత్ర దేశాలతో సమన్వయం చేసుకుంటూ యువగళం కార్యక్రమానికి, వాలంటీర్లకు ఉడతాభక్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. యూరప్లోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీతో కలిసి తాము చేపట్టబోతున్న కార్యక్రమాల గురించి వివరించారు. 2024లో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా అహర్నిశలు కష్టపడతామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎక్కువ మంది ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు భారత్కు వెళ్లి తమ వంతు సాయం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఐర్లాండ్ తరపున అధ్యక్షులు భారత్ భాష్యం, ముఖ్య ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు శ్రీనివాస్ పుత్తా, రంగా గల్లా, శివ బాబు మేములపల్లి, అచ్యుత కిషోర్ కొత్తపల్లి. కోటేంద్ర లేళ్ల, విజయ్ కృష్ణ చందోలు, సాయి పవన్ శర్మ, రామ్ వంగవోలు, రామకృష్ణ ఏలూరు, శుభకర రామినేని, జగన్ రెడ్డి ముత్తుములు, వెంకట్రావు, భగత్ సహా యాబై పైగా ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశానికి ఐర్లాండ్ లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ కార్యవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.














