అంతరిక్షంపై భారత్ సంచలనం సృష్టించింది. చందమామపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగింది. 14 రోజులపాటు చంద్రుడిపై పరిశోధనలు జరుపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం పూర్తిగా బిలాలు, అగాథాలతో కూడుకున్నది. ఇక్కడ అడుగుపెట్టడం కష్టమైన పని. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు రష్యా ఇటీవల లూనా-25 వ్యోమనౌకను ప్రయోగించగా అది చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. తాజాగా చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువంపై సేఫ్గా దిగి సంచలనం సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా, చైనా, రష్యాలాంటి దేశాలు సైతం ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేదు. తాజాగా చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది.

ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.














