ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న, పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, సంబంధిత శాఖ మంత్రిగా తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీస్) ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన సహాయం చేసేందుకు గాను, గల్ఫ్ దేశాలలో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసి, స్థానికంగా ఉన్న తెలుగు కుటుంబాల సహకారంతో తాత్కాలిక వసతి, భద్రత, అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఏపీ ఎన్నార్టీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తూ, కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ వివరాలను ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ 0863-2340678, వాట్సప్ నంబర్ 85000 27678కు తెలియజేయవచ్చని, [email protected] ద్వారా ఈమెయిల్ చెయ్యొచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే సంప్రదించి సహాయం పొందాలని మంత్రి సూచించారు.















