విశ్వక్సేన్ కథానాయకుడిగా తరుణ్భాస్కర్ దర్శకత్వంలో ఎనిమిదేండ్ల క్రితం వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఎంతటి విజయాన్ని అందుకున్నదో తెలిసిందే. కల్ట్ కామెడీ మూవీగా ఆడియన్స్ని నుంచి కితాబులందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న సినిమా ఈఎన్ఈ రిపీట్. విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి కలిసి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్లో జరుగుతున్నది. నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్లో వింటేజ్ కన్వర్టిబుల్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహం కనిపిస్తున్న విశ్వక్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమానులను చూడొచ్చు. మొదటి భాగం పరిమిత బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ, సీక్వెల్ క్రేజ్ దృష్ట్యా ఈసారి దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత రిచ్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ను త్వరగా పూర్తిచేసి 2026 అక్టోబరులో లేదా అదే ఏడాది చివర్లో గ్రాండ్గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: ఏజే ఆరోల్, సంగీతం: వివేక్ సాగర్.















