
సాయిపల్లవి తొలి బాలీవుడ్ సినిమా ఏక్ దిన్ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను దక్కించుకున్నది. అయితే నటిగా సాయిపల్లవి మాత్రం పాసైపోయింది. ఆమె నటనకు ఉత్తరాదిన కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తన బాలీవుడ్ ఎంట్రీకి ఏక్ దిన్ సినిమాని ఎంచుకోవడానికి గల కారణాన్ని ఇటీవల చెప్పుకొచ్చింది సాయిపల్లవి. కథలోని లోతు, అందులోని పాత్ర వల్ల నటిగా నాకు లభించే సంతృప్తి, ఈ రెండు అంశాలనే పరిగణనలోకి తీసుకొని సినిమాను అంగీకరిస్తాను. నాకు హాలీవుడ్ క్లాసిక్ బిఫోర్ సన్రైజ్ అంటే చాలా ఇష్టం. ఏక్ దిన్ కథ వినగానే నాకు ఆ సినిమానే గుర్తొచ్చింది. ఒకేరోజులో జరిగే ఈ కథలో ఇద్దరు వ్యక్తుల సంభాషణలు, భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి. ఈ హాలీవుడ్ చిత్రానికి ప్రంపచవ్యాప్తంగా అభిమానులున్నారు. వారిలో నేనూ ఒకదాన్ని. ఆ కథలోని స్వచ్ఛత, గాఢత ఏక్ దిన్ లో కూడా ఉండటంతో చేయడానికి అంగీకరించాను. ఫలితం గురించి నేనెప్పుడూ ఆలోచించను. నటిగా నాకు సంతృప్తి లభించింది అదిచాలు అని తెలిపింది సాయిపల్లవి.





























