అమెరికాలోని తెలుగువారికి మరో అరుదైన గుర్తింపు లభించింది. శ్రీ శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్రం గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఏప్రిల్ 2, 2022వ తేదీని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించారు. దీనిని తెలియజేస్తూ ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూరకు గవర్నర్ అబ్బాట్ ఆ అధికారిక ప్రకటన ప్రతిమ అందజేశారు.
టెక్సాస్లోని వివిధ నగరాల్లో నివసిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాలు, వారి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవుతూ విద్య, వైద్యం, వాణిజ్యం, ప్రభుత్వ, కళా రంగాలలో వారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. తెలుగు వారి క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల వారికుండే గౌరవం, నిబద్దత ఆదర్శప్రాయమని గవర్నర్ కొనియాడారు. టెక్సాస్లోని తెలుగువారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించడం టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరి తరపున గవర్నర్ గ్రెగ్ అబాట్, ఆయన భార్య సినీలియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.














