అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించింది. విదేశీ కార్మికులు, ఎఫ్-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను క్రమబద్ధీకరించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అదేవిధంగా లాభాపేక్ష లేని సంస్థలను నిర్వహించే పారిశ్రామికవేత్తలకు మెరుగైన పని వసతులను కల్పించనుంది. నాన్ ఇమ్మిగ్రెంట్(వలసేతర) వర్కర్స్కు కూడా ఈ వీసా ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన విధివిధానాలను యూఎస్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసె స్(యూఎస్సీఐఎస్) అధికారులు సిద్ధం చేశారు.
వీసాలకు సంబంధించి కాంగ్రెస్ పేర్కొన్న ఏటా 60 వేల పరిమితిని మించరాదని నిర్ణయించారు. ఈ వీసా ఆయా సంస్థలకు మూడు నుంచి ఆరేళ్లపాటు విదేశీ కార్మికులను, ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఇస్తుంది. అయితే, హెచ్-1బీ వీసా ఉన్నవారు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తూ తరచుగా తమ వర్క్ వీసాలను రెన్యువల్ చేయించుకుంటున్నారు. అమెరికాలోని సాంకేతిక సంస్థలు ఏటా వేల సంఖ్యలో భారత్, చైనాకు చెందిన ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాలను మరింత పారదర్శకం చేసేందుకు బైడెన్ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై పెట్టుబడిదారులు, ప్రజలు, ఆయా సంస్థల యజమానులు తమ అభిప్రాయం చెప్పాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కోరింది.
హెచ్-1బీ వీసాల్లో చేసిన మార్పులు భారతీయులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి రావడం, పనిచేసే ప్రాంతాన్ని కచ్చితంగా సందర్శించడం, హెచ్-1బీ వీసా కోరుకునే భారతీయులను అదనంగా స్ర్కూటినీ చేయడం వంటివి భారతీయులకు ఇబ్బందిగా మారుతుందని తెలుస్తోంది. అయితే చట్టబద్ధమైన ఉపాధిని పొందే క్రమంలో ఎలాంటి నకిలీలకు అవకాశంలేకుండా చూసేందుకే మార్పులు చేసినట్టు అమెరికా చెబుతోంది.














