అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు సంభవించడంతో సబ్వే వ్యవస్థ నీట ముగిసింది. రహదారులు, వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ ఖాతీ హోచల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. లా గార్డియా విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా నడిచాయి. రహదారులు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటిలో చిక్కుకుని వాహనాలు నిలిచిపోవడంతో పలువురు వాటిని అక్కడే వదిలేయడం కన్పించింది. కొందరు తమ వాహనాల్లో పలు గంటల పాటు చిక్కుకుపోయి సహాయం కోసం అర్థించారు. గురువారం రాత్రి సుమారు 13 సెంటీమీటర్లు, శుక్రవారం రోజంతా 18 సెంటీమీటర్ల వర్షం పడినట్టు గవర్నర్ తెలిపారు. న్యూయార్క్ సిటీ, సమీపంలోని హడ్సన్ వ్యాలీ, లాంగ్ ఐలాండ్లలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. . కాగా వర్షాల ప్రభావంతో పలు సబ్వే రైలు లైన్లను నిలిపివేశారు. పట్టాలపై వరద నీరు వచ్చిచేరిందని దీనితో రైళ్ల నిలిపివేత తప్పలేదని ఎంటిఎ తెలిపింది.















