Namaste NRI

అమెరికాకు ఇరాన్‌ ఒక కొత్త ప్రతిపాదన

యుద్ధం ముగింపునకు అమెరికాకు ఇరాన్‌ ఒక కొత్త ప్రతిపాదన అందచేసింది. తమ దేశంపై అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేసి, యుద్ధానికి ముగింపు పలికితే హొర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు తాము సిద్ధమని పేర్కొన్నది. అణు కార్యక్రమంపై మాత్రం తర్వాత చర్చిద్దామని ప్రతిపాదించింది. అమెరికాకు ఈ ప్రతిపాదన అందిన నేపథ్యంలో ట్రంప్‌ తన జాతీయ భద్రత, విదేశాంగ విధాన బృందంతో సిచుచేషన్‌ రూమ్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ పాకిస్థాన్‌లో పర్యటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రతిపాదనకు ట్రంప్‌ అంగీకరించే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హొర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధాన్ని ముగించడం ఇప్పుడు ఇరాన్‌ కొత్త ప్రతిపాదనని అమెరికా అధికారులను అంగీకరించలేదని తెలిసింది.

అణు చర్చలను తర్వాత దశకు వాయిదా వేయాలని పాకిస్థాన్‌ మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌ అమెరికాకు తన ప్రతిపాదన తెలియచేసినట్లు తెలిసింది. చర్చలలో నెలకొన్న ప్రతిష్టంభన, తర్వాత చేపట్టే చర్యల గురించి ట్రంప్‌ బృందం చర్చిస్తుందని కూడా పేర్కొంది. యురేనియం శుద్ధి ప్రక్రియను నిలిపివేయడానికి ఇరాన్‌ను ఒప్పించడం, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించడం ఇప్పుడు ట్రంప్‌ యుద్ధ లక్ష్యాలని పేర్కొంది. అయితే దీనిపై ఇప్పటివరకు అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ లేదు.

Social Share Spread Message

Latest News