ఇజ్రాయెల్-హమాస్ వార్ నెలరోజులకు చేరుకోగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా గాజాపై వైమానిక, భూతల దాడులను ఇజ్రాయెల్ ముమ్మరం చేసింది. గాజాలోని మఘజి క్యాంప్పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 38 మంది పాలస్తీనీయులు మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు.గాజా స్ట్రిప్పై అణుబాంబు వేసే అవకాశాలను కూడా ఇజ్రాయెల్ పరిశీలిస్తుందని ఇజ్రాయిలీ మంత్రి అమిహై ఎలియహు ప్రకటించడం కలకలం రేపింది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో అణు బాంబును ప్రయోగించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని కూడా ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని, యుద్ధ నిర్ణయాలను తీసుకునేందుకు ఏర్పాటైన కేబినెట్ భద్రతా కమిటీలో తాను సభ్యుడిని కాదని, అయితే గాజాపై అణుబాంబును ప్రయోగించే అవకాశాలు లేకపోలేదని ఆయన చెప్పుకొచ్చారు.














