Namaste NRI

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మోదీ పిలుపు…త్వరగా ముగించండి

సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి తెలియచేశారు. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, పుతిన్‌ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి తీసుకువచ్చేందుకు తాజాగా జరుగుతున్న అన్ని ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని, సంబంధిత పక్షాలన్నీ నిర్మాణాత్మకంగా ముందడుగు వేస్తాయని ఆశిస్తున్నామని తన ప్రారంభోపన్యాసంలో మోదీ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న పుతిన్‌ భారత పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. కష్టకాలంలో సైతం భారత్‌-రష్యా పరస్పరం అండగా నిలబడ్డాయని ఆయన తెలిపారు.

ప్రపంచ శాంతి, సుస్థిరత, సౌభాగ్యం కోసం భారత్‌, రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ముఖ్యమని మోదీ తెలిపారు. భద్రత, అనుసంధానం, అవకాశం అనే మూడు స్తంభాల ప్రాతిపదికన భారత్‌ ఇతర దేశాలకు తన స్నేహహస్తం అందచేస్తుందని ఆయన చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా భారత్‌ను తీవ్రంగా వేధిస్తున్న ఉగ్రవాదంపై సమిష్టిగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరముందని మోదీ పిలుపునిచ్చారు.

Social Share Spread Message

Latest News