గాజా బాధిత ప్రజలకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మరోమారు తన సంఘీభావం ప్రకటించారు. విలేకరుల సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ గాజా ప్రజలకు మానవీయ సాయం విషయంలో తాను ఇజ్రాయెల్ నేతలతో చాలా కరకుగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. హమాస్ ఇజ్రాయెల్ పరస్పర ఘర్షణలతో వేలాదిగా సామాన్య జనం నిత్యజీవిత సంక్లిష్టతను ఎదుర్కొంటున్నారని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అక్కడి బాధితులకు అవసరం అయిన మానవీయ సాయం అందాల్సి ఉంది. ఈ సాయం అందకుండా చేసేందుకు ఎవరు యత్నించినా వారిని జవాబుదారి చేసి వ్యవహరిస్తామని ఇజ్రాయెల్కు చురకలు పెట్టారు.
ఇజ్రాయెల్ పూర్తిగా దెబ్బతిందని, దీనిని తాను కాదనడం లేదని, అయితే బాధిత ప్రజలకు సాయం చేసేలా చేస్తేనే ఇజ్రాయెల్ ప్రతిష్ట నిలుస్తుందని బైడెన్ స్పష్టం చేశారు. గాజా స్ట్రిప్లో ఇప్పటి పరిస్థితి అత్యంత దారుణమైన మానవీయ ఉపద్రవానికి దారితీస్తుందని ఐరాస సంస్థలు పేర్కొన్న విషయాన్ని బైడెన్ ప్రస్తావించారు. మానవీయ సాయం విషయంలో ఎవరి మాట వినేది లేదని ఈ విషయం ఇజ్రాయెల్కు కూడా తెలుసునని చెప్పారు.














