ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారని కేంద విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 15, 16 తేదీల్లో సైప్రస్లో పర్యటిస్తారు. 16, 17 తేదీల్లో కెనడా లోని జీ7 సదస్సులో పాల్గొంటారు. 18న క్రొయేషియాలో పర్యటిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు నికొస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి మోడీ ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్తో చర్చల తరువాత లిమాసోల్లో వ్యాపార దిగ్గజాలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబందాల పటిష్టతకు మోడీ పర్యటన దోహదం కానుంది.

అనంతరం కెనడాకు మోదీ వెళ్తారు. కెనడా ప్రధాని మార్క్ కార్నే ఆహ్వానం మేరకు కననాస్కిస్లో జరగనున్న జీ7 సదస్సులో మోడీ పాల్గొంటారు. జీ7 సదస్సులో మోడీ పాల్గొనడం వరుసగా ఇది ఆరోసారి. సదస్సు సందర్భంగా పలు ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ప్రధాని పాల్గొంటారు. జీ 7 దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో అనుసంధానం , క్వాంటమ్ సంబంధిత అంశాల గురించి చర్చలు జరపనున్నారు.

ప్రధాని తన తిరుగు ప్రయాణంలో భాగంగా క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్ ఆహ్వానం మేరకు జూన్ 18న ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. క్రొయేషియాలో భారత దేశ ప్రధాని ఒకరు పర్యటించనుండటం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధాని పర్యటన ఒక మైలు రాయి కానుంది. ప్రధాని ఫ్లెంకోవిక్, అధ్యక్షుడు జోరన్ మిలనోవిక్తో మోడీ సమావేశమవుతారు. యూరోపియన్ భాగస్వాములతో మరింత పటిష్టబంధాల గురించి చర్చిస్తారు.
