భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు మరింత ముదురుతున్నాయి. భారత్లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలకు, వారి కుటుంబాలకు ఉండే అంతర్జాతీయ దౌత్యపరమైన రక్షణలను ఉపసంహరిస్తామని భారత్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఆ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్టు కెనడా ప్రకటించింది. చండీగఢ్, ముంబై, బెంగళూరులోని కాన్సులేట్లలో వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపింది. భారత్లోని కెనడా పౌరులు అత్యంత జాగరూకతతో ఉండాలని సూచించింది. కెనడాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగవచ్చని హెచ్చరించింది. సంప్రదాయ, సోషల్ మీడియాలో కెనడాకు వ్యతిరేకంగా ప్రచారం జరగొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో కెనడియన్లు హింసకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని కోరింది. దౌత్య సంబంధాలపై వియన్నా సదస్సులో చేసిన తీర్మానాలను భారత్ అతిక్రమించిందని కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ ఆరోపించారు.














