విరాట్ కర్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం పెదకాపు 1. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈనెల 29న విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ఇది విరాట్ కోసం పుట్టిన కథ. పెదకాపు జర్నీ ఇంకా చాలా ఉంది. ఈ సినిమాకు ఓ సామాన్యుడి సంతకం అనే క్యాప్షన్ ఊరికే పెట్టలేదు. కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి అని తెలిపారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఓ సామాన్యుడు పరిస్థితులను తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఓ యుద్ధమే చేయాలి. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం ఉండదు. అదే ఈ సినిమా కథ అన్నారు. ఈ కథను బలంగా నమ్మాం కాబట్టే కొత్త హీరో అయినా భారీ స్థాయిలో తెరకెక్కించాం. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి హద్దులు విధించుకోవద్దని ముందే అనుకున్నాం. సినిమా షూటింగ్లో హీరో విరాట్కర్ణ చాలాసార్లు గాయపడ్డాడు. అయినా అంకితభావంతో శ్రమించాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు వెట్రిమారన్ స్థాయిలో పేరొస్తుంది. కుటుంబం, సమూహం, ప్రాంతం ఏదైనా కావొచ్చు, నా అనుకునే వారికి అండగా ఉండే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం అన్నారు. ఈ సినిమా తనకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందని హీరో విరాట్కర్ణ పేర్కొన్నాడు. ఈ వేడుకలో రావు రమేష్, మల్లిడి వశిష్ట, సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.














