సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ఈటీ (ఎవరికీ తలవంచడు). ప్రియాంక అరుల్ మోహన్ నాయికగా నటిస్తున్నది. తాజాగా సినిమా ట్రైలర్ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నాకు ఇష్టమైన హీరో సూర్య. ఆయన ఈటీ సినిమా తెలుగు ట్రైలర్ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు అని అన్నారు. అమ్మాయిలంటే బలహీనులు అనుకుంటారు. కాదు బలవంతులు అని నిరూపించాలి అనే సంభాషణలు ట్రైలర్లో వినిపిస్తాయి. మహిళలకి ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రమని ట్రైలర్ని బట్టి స్పష్టమవుతోంది. దర్శకుడు పాండిరాజ్ సమకాలీన సమస్యల్ని కథాంశంగా ఎంచుకుని ఈ సినిమా చేశారు. ప్రజల కోసం పాటు పడే ఓ సేవకుడిగా సూర్య కనిపిస్తారు. ఇంటిల్లిపాదినీ అలరించే చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాణంలో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం : డి.ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: అర్ రత్నవేలు.














