ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షునిగా శృంగవరపు నిరంజన్ బాధ్యతలు చేపట్టారు. అమెరికా, ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సంఘం 23వ మహాసభల్లో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 2023 నుంచి 2025 వరకూ ఈ బాధ్యతల్లో ఉంటారు. తానా కన్వెన్షన్ సభావేదికపై ఔట్ గోయింగ్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు సభాముఖంగా నిరంజన్ శృంగవరపు ని వేదికపై ఆహ్వానించి తానా అధ్యక్షునిగా తనకు ఈ రోజు చివరిరోజని, రేపటి నుండి అనగా జులై 10 నుండి నిరంజన్ శృంగవరపు అధ్యక్షునిగా కొనసాగుతారని అన్నారు.

నిరంజన్ శృంగవరపు ఇంతకు ముందు తానా ఫౌండేషన్ ట్రస్టీగా మరియు తానా ఫౌండేషన్ చైర్మన్గా సేవలందించి, 2021 తానా ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు 2023లో తానా అధ్యక్షులుగా నిరంజన్ శృంగవరపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు తానా నాయకులు, సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ నిరంజన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

2008లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యుడిగా చేరిని ఆయన పలు హోదాల్లో సేవలు అందించారు. తానా అభివృద్ధికి భారీగా విరాళం ఇవ్వడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ తానా లీడర్షిప్ అందరికీ, కన్వెన్షన్ కి విచ్చేసిన అతిరథమహారథులకు, అలాగే తనను తానా అధ్యక్షునిగా ఎన్నకున్న తానా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది తన అదృష్టమని, అందరినీ కలుపుకొని పోతూ తానా ని సంస్థగతంగా మరింత బలోపేతం చేస్తామన్నారు.
కర్నూలు జిల్లా, రాజానగరం గ్రామానికి చెందిన శృంగవరపు సుబ్రహ్మణ్యం, ఇంద్రావతి దంపతుల మొదటి కుమారుడు నిరంజన్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఐటీ రంగంలో రాణించేందుకు 2000లో యూఎస్ వెళ్లారు. 2003లో ఐటీ బిజినెస్ సొల్యూషన్స్ అండ్ సర్వీసె్సలోకి ప్రవేశించడానికి ముందు డైమ్లెర్ క్రిస్లర్, ఐబీఎం సంస్థల కోసం పని చేశారు. డెట్రాయిట్లోని నోవిలో 2003లో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు.














