ప్రభాస్ కథానాయకుడిగా దీపికా పడుకొనె కాంబినేషన్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్-కె. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశాపటానీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వాట్ ఈజ్ ప్రాజెక్ట్-కె అంటూ చిత్ర బృందం చేపట్టిన ప్రచారం టైటిల్ ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకతను పెంచింది. అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ను ప్రకటించారు. ఈ చిత్రానికి కల్కి 2898 ఏడీ అనే టైటిల్ను ఖరారు చేశారు.ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, అబ్బురపరిచే విజువల్స్తో ఫస్ట్గ్లింప్స్ సరికొత్త అనుభూతిని పంచింది. ప్రతీ యుగంలో ధర్మ రక్షణ కోసం ఓ మహావీరుడు పుట్టుకొస్తాడు అనే సందేశాన్ని అందిస్తూ గ్లింప్స్ ఆకట్టుకుంది. దర్శకుడు నాగ్అశ్విన్ మాట్లాడుతూ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. నేను సైన్స్ ఫిక్షన్, పురాణాలను బాగా ఇష్టపడతాను. మహాభారతం, స్టార్వార్స్ చూస్తూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే సినిమా చేయడం గర్వంగా ఉంది అన్నారు. అత్యంత ప్రాతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ 2024లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.














