వలసదారులపై న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ నగరం నిండిపోయిందని, కొత్తగా ఇక్కడికి వచ్చే వారికి ఆశ్రయం, సర్వీసులను అందించలేమన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి న్యూయార్క్ సిటీ కొత్తగా 90వేల మంది వలసదారులకు స్వాగతం పలికిందని మేయర్ తెలిపారు. వీరిలో 40వేల మంది వరకు అక్రమంగా నగరంలో ప్రవేశించినట్లు ఆయన పేర్కొన్నారు. కొద్దినెలల క్రితమే తాము నగరం నిండుతున్నట్లు చెప్పామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూయార్క్ నగరంలో ఇక స్థలం ఖాళీగా లేదని, మాకిప్పుడు సహాయం కావాలని వాషింగ్టన్ డీసీలో జరిగిన మేయర్స్ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు. న్యూయార్క్లో హౌసింగ్ చాలా ఖరీదైనదని పేర్కొన్నారు. నగరంలో ఆహారం, రవాణా, ఇతర సదుపాయాలకు వెచ్చించే మొత్తం అనేది దేశంలోని మిగిలిన నగరాల కంటే చాలా ఎక్కువగా ఉందన్నారు. ఇక వలస సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రూపొందించిన కొత్త ప్రణాళిక ప్రకారం ఒంటరి వయోజనులు రెండు నెలలు మాత్రమే నగరంలోని షెల్టర్లలో ఉండగలరని తెలిపారు.














