కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లను గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్, తెలుగు సంఘాల ఐఖ్య వేదిక అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు కలిశారు. తిరుపతి ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్ది, కువైట్ సహా గల్ఫ్ దేశాల నుంచి నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభించాలంటూ విన్నవించి వినతిపత్రాన్ని సమర్పించారు. విజయవాడ ఎయిర్పోర్టుకు కూడా గల్ఫ్ దేశాల నుండి డైరెక్ట్ విమానాలు నడిపించాలని కోరారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు.

వీలైనంత త్వరగా కువైట్ నుండి తిరుపతికి సర్వీసులు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. కువైట్ నుండి ఇండియాకి ఉన్న సీటింగ్ కెపాసిటీని 12,000 నుండి 18,000 వేలకు పెంచామని, వివిద విమానయాన సంస్థలతో చర్చలు కూడా జరిపామని తెలిపారు. వీలైనంత త్వరలో కువైట్కి సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. తాము అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపట్టినందుకు రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్కి సుధాకర రావు ధన్యవాదాలు తెలియచేశారు. మంత్రి లోకేష్కు కువైట్లో తెలుగుదేశం పార్టీ తరఫున జరుగుతున్న కార్యకలాపాల గురించి సుధాకర రావు వివరించారు.















