భారత్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. మిత్రదేశం అంటూనే న్యూఢిల్లీపై అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నందుకు భారత్పై సుంకాల మోత మోగిస్తానంటూ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలతో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ వివాదం వేళ భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ యూఎస్కు కీలక సూచనలు చేశారు.

భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను తెంచుకోకండి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సూచించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు. కానీ చైనా చేయొచ్చా అని ప్రశ్నించారు. రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనుగోలుదారులో చైనా నంబర్ వన్గా ఉందని తెలిపారు. అలాంటిది చైనాకు మాత్రం 90 రోజుల పాటూ ఎలాంటి సుంకాలు విధించకుండా మినహాయింపు ఇవ్వొచ్చా? అని ప్రశ్నించారు. చైనాకు మినహాయింపు ఇచ్చి, భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు.















