ఇరాన్ రాజధానిపై అమెరికా-ఇజ్రాయెల్ మరిన్ని దాడులు జరపడం, లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపంలోకి మారుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ భయాలు పెరిగిపోయాయి. ప్రపంచ పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటైన దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు వెలువడినట్లయింది.

గత రెండు వారాలకు పైగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండగా పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ స్థావరాలు, గల్ఫ్ అరబ్ దేశాలకు చెందిన ఇంధన స్థావరాలపైన ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరుపుతున్నది. హొర్ముజ్ జలసంధిలో, చుట్టుపక్కల వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరపడం, దాడులకు సంబంధించి ఇరాన్ చేస్తున్న హెచ్చరికలతో ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలంటూ అమెరికాపై ఒత్తిడి అధికమవుతున్నది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 100 డాలర్ల మేరకు ఉంది.















