
అమెరికాతో శాంతి ఒప్పందానికి చేరువ అయినప్పటికీ ఆ దేశం తన లక్ష్యాన్ని మార్చుకొని, మూసివేత వ్యూహాన్ని అవలంబించినందునే పట్టాలు తప్పిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ విమర్శించారు. 47 సంవత్సరాలలో తొలిసారిగా వాషింగ్టన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపామని, ఘర్షణలకు ముగింపు పలకాలని భావించామని, కానీ నేర్చుకున్నది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. పురోగతి సాధించే తరుణంలో కీలక దశలో చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. అమెరికాతో షరతులతో కూడిన దౌత్యం నెరపేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నదని అన్నారు. కాగా ఇరాన్ హక్కులను అమెరికా గౌరవిస్తే దౌత్యపరమైన పురోగతి సాధ్యమేనని దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. ఇస్లామాబాద్ చర్చల సందర్భంగా ఇరాన్ బృందం చేసిన కృషిని ఆయన అభినందించారు.















