కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఎమోషనల్ పీరియాడిక్ ప్రేమకథ దూరదర్శిని. కలిపింది ఇద్దరినీ అనేది ఉపశీర్షిక. సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటించారు. జయశంకర్రెడ్డి ఎం. పాటిమీద సంతోష్ నిర్మాతలు. ఈ నెల 15న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో దర్శకుడు కార్తికేయ కొమ్మి విలేకరులతో ముచ్చటించారు. 90ల కాలంలో దూరదర్శన్లో వచ్చే చిత్రలహరి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసిన వారికి ఈ సినిమా పూర్తి సంతృప్తినిస్తుంది. చిత్రలహరి టైమ్ పీరియడ్ మిస్ అయిన వారికి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ రోజుల్లో చిత్రలహరి కోసం అందరూ ఎలా ఎదురుచూసేవారు? చిత్రలహరి అనేది గ్యాదరింగ్ పాయింట్లా ఎలా ఉండేది? అనేది ఇందులో ఆసక్తికరంగా చూపించాం. ఈ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. ఇందులో ప్రేమ మాత్రమే ఉండదు. యువతకు, తల్లిదండ్రులకు, సమాజానికి నచ్చే అంశాలు కూడా ఉంటాయి అన్నారు.

ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ పెద్దాయన ప్రస్తుతం అరుణాచలంలో బిక్షాటన చేస్తున్నారు. ఆయన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేశాం. సొంత కొడుకు వల్లే ఆయనకు బిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదెలా అనేది ఇందులో చూపించాం. పతాక సన్నివేశాలు అందర్నీ ఆలోచింపజేస్తాయి. సినిమా చూసిన కాసేపటివరకూ ఆ ఫీల్ వదిలివెళ్లదు. పల్లెటూరి నేపథ్యంలో జరిగే రియలిస్టిక్ లవ్స్టోరీ ఇది అని అన్నారు.















