పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. పరస్పర దాడులను నిలిపివేసేందుకు ఇరాన్, అమెరికా అంగీకరించాయి. హార్ముజ్ జలసంధిపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకోవ డానికి తిరిగి సంప్రదింపులు ప్రారంభించాలని నిర్ణయించాయి. దీంతో తాత్కాలిక శాంతి ఒడంబడిక సజీవంగానే ఉంటుందన్న ఆశాభావం వక్తమవుతోంది. ఎంఓయూలోని అన్ని అంశాల పైన సాంకేతిక చర్చలు కొనసాగుతాయి. ఇరు పక్షాలు దాడులకు స్వస్తి చెబుతాయి. హార్ముజ్లో నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు అని ఓ అమెరికా అధికారి తెలిపారు. ఈ నెల 17న 14 సూత్రాల అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై ఇరాన్, అమెరికా సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారమే హార్ముజ్ను వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచారు. కాగా ఇరు పక్షాల మధ్య మంగళవారం ఖతార్లో చర్చలు ప్రారంభం అవుతాయని తెలిసిందే.

జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై గురువారం ఇరాన్ దాడి జరిపిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తిరిగి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎంఓయూ కింద కుదుర్చుకున్న కాల్పుల విరమణను ఇరు దేశాలు బేఖాతరు చేసి దాడులు, ప్రతిదాడులకు దిగాయి. కువైట్, అమెరికా స్థావరాలపై ఇరాన్ సేనలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. యుద్ధాన్ని ముగించేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవించని పక్షంలో ఇరాన్ అనేదే ఉండదని అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య తాజాగా హింస చోటుచేసుకున్నప్పటికీ ఇరాన్, అమెరికా అధికారులు మాత్రం నేడు దోహాలో సమావేశమవుతారు. ఎంఓయూను సజీవంగా ఉంచేందుకు, మరో సైనిక చర్య జరగకుండా నివారించేందుకు ప్రయత్నిస్తారు.





























