వారణాసిలోని శివాల ఘాట్ సమీపంలో మహా నిర్వాణ ఘాట్లో వద్ద తానా గ్రూప్ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మహా నిర్వాణ ఘాట్లోని శ్రీ మహారాజ్ ప్రారంభించారు. ప్రసిద్ధి చెందిన ఈ ఘాట్కు తెలుగు యాత్రికులు స్నానం చేయడానికి వస్తుంటారు. అన్న వితరణ సందర్భంగా తానా స్టాల్ ప్రజలతో కిక్కిరిసిసోయింది. ఆహారం రుచికరంగా ఉందని అనేక మంది సంతృప్తి వ్యక్తం చేశారు. వారణాసిలో ఆర్యవైశ్య సమాజం వారు కూడా చాలా సత్రములు స్థాపించి, ఉచిత ఆహార పంపిణీ చేస్తూ సామాజిక సేవలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆర్యవైశ్య సమాజంలో ఒకటైన వాసవి సదన్కు యావత్ భారతదేశంలో అనేక శాఖలు ఉన్నాయి. నేడు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కోసం తానా స్టాల్ సమీపంలోనే వాసవి సదన్ వారు మరో స్టాల్ను ఏర్పాటు చేశారు.


తానా స్టాల్ దగ్గర జనసమూహాన్ని చూశాక వాసవీ సదన్ సెక్రటరీ బరతయ్య తానా స్టాల్ని సందర్శించారు. ఆహారం రుచిగా ఉందని కితాబిచ్చారు. వాసవీ సదన్ కమిటీ కూడా రేపు తానా స్టాల్ని సందర్శిస్తుందని తెలియజేశారు. కార్యక్రమం తొలి రోజున తానా స్టాల్లో 750 మందికి పైగా ఆహారాన్ని అందించారు. ఇక రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఈ ఘాట్తో పాటూ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వాటర్ బాటిల్స్, మజ్జిగ, పాల ప్యాకెట్లను పంపిణీ చేయాలని తానా నిర్ణయించింది.





























