అఫ్గానిస్తాన్లో నెలకొన్న సంక్షోభంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లు కలిసి ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మానవ హక్కులు, మహిళలు, మైనార్టీల హక్కుల విషయంలో ఇచ్చిన హామీలకు తాలిబన్లు కట్టుబడి ఉండాల్సిందే అంటూ స్పష్టం చేశారు. పాలనను చేజిక్కించుకున్న తాలిబన్లనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్తాన్ను ఉగ్రవాదుల శిక్షణా కేంద్రంగా మార్చొద్దంటూ తేల్చి చెప్పారు. బైడెన్తో మోదీ భేటీ అయిన సందర్భంగా అఫ్గానిస్తాన్లో నెలకొన్న ప్రజా సంక్షోభంపై చర్చించారు. ఉగ్రవాదంపై ప్రధానంగా మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలనకు తాలిబన్ ప్రభుత్వం కృషి చేయాలని బైడెన్, నరేంద్ర మోదీలు సూచించారు. ఉగ్రమూకలకు నిధుల అందజేతనూ అడ్డుకోవాలని స్పష్టం చేశాయి. అలాగే అఫ్గానిస్తాన్ను వీడాలని అనుకుంటున్న అఫ్గాన్లు, విదేశీయులను సురక్షితంగా పంపాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్తాన్కు మానవతా దృక్పథంతో అందే సాయాన్ని తాలిబన్లు అనుమతించాలని హితవు పలికారు. శాంతియుతమైన అఫ్గాన్ నిర్మాణంలో ఇతర మిత్రదేశాలతో కలిసి పని చేస్తామని ప్రకటించారు.














