వినాయక చవితి పండుగను కెంట్లోని డార్ట్ఫోర్డ్ నగరంలో ఫీనిక్స్ క్వార్టర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 300 మందికి పైగా హాజరై ప్రత్యేక పూజలు, సామూహిక మంగళ హారతులతో వినాయక మంత్రాలు, పాటలు పాడి ఎంతో ఆనందంతో ఐదు రోజుల పాటు ఈ పండగను నిర్వహించారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి గణనాధుని ఆశీస్సులు పొందారు. ఈ పండుగకు డార్ట్ఫోర్డ్ పార్లమెంటు సభ్యుడు గారెత్ జాన్సన్, డార్ట్ఫోర్డ్ కౌన్సిల్ లీడర్ జెరెమీ కైట్, లెఫ్టినెంట్ గుర్విందర్ సంధర్, టౌన్ కౌన్సిలర్లు క్రిస్ షిప్పం, రిచర్డ్ వెల్స్, బ్రెంట్ కౌన్సిలర్ అవతార్ సంధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

చివరి రోజున కారుపై గణపతిని ఊరేగించి నిమజ్ఞనం చేశారు. భారతీయ పద్దతుల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నట్లు డార్ట్ ఫోర్డ్ ఫీనిక్స్ క్వార్టర్ రెసిడెంట్స్ కమ్యూనిటీ వాలంటీర్ కృష్ణ పవన్ చల్లా తెలిపారు. పండగ సందర్భంగా భారతీయ, తెలుగు వంటకాలతో విందు, ప్రసాదం ఏర్పాట్లు చేసిన మహిళా నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భక్తులందరూ తమ కుటుంబాలతో పూజానంతరం ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
















