ఆంధ్రప్రదేశ్: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన అధ్యక్షుడు డాక్టర్ పి. గురు రాజా, సెంట్రల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి. గురు రాజాకి, సెంట్రల్ కమిటీ సభ్యులకు మన్నవ మోహనకృష్ణ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ మరింత బలోపేతమై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.చంద్రబాబు నాయుడు నాయకత్వంలో,నారా లోకేష్ మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి ఎన్నారై టీడీపీ చేస్తున్న కృషి అభినందనీయమని మన్నవ మోహనకృష్ణ పేర్కొన్నారు.


ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్నారైల అండతో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎన్ఆర్ఐల కృషి మరువలేనిది. తెలుగుజాతి ఆత్మగౌరవం అన్న ఎన్టీఆర్. తెలుగు జాతిని నెం.1గా చేసే బాధ్యత తీసుకుందాం. 2029 ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, మరియు ప్రముఖులు పాల్గొన్నారు.


















