అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య ఇస్లామాబాద్లో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం పాకిస్థాన్ రాజధానికి దౌత్యవేత్తలు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య తొలి దఫా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు తగ్గించే నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. ఖతార్ షేక్ తమిమ్ బిన్ హమ్మద్, టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ను కలిశారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ , ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించారు. ఆ దేశ విదేశాంగ మంత్రి అరగాచితో సంప్రదింపులు చేశారు.

ఇరానీ పార్లమెంట్ స్పీకర్ భగేర్ ఘాలిబఫ్ను కూడా అసిమ్ మునీర్ కలిశారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు, పాక్ తమవంతు ప్రయత్నం చేస్తున్నది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్లో తొలి దశ శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ మధ్య 40 రోజుల వార్ తర్వాత ఆ ప్రక్రియ జరిగింది. ఇరాన్, అమెరికా మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నది.















