వరలక్ష్మి శరత్కుమార్ నటించి, దర్శకత్వం వహించిన హై-కాన్సెప్ట్ థ్రిల్లర్ సరస్వతి. దోశ డైరీస్ పతాకంపై పూజా శరత్కుమార్ నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ టెక్నీషియన్స్ సహకారం, ఆత్మబంధువుల దీవెనల వల్లే ఈ సినిమాను 25రోజుల్లో పూర్తి చేయగలిగానని, ప్రకాష్రాజ్, ప్రియమణి తమ పాత్రలకు జీవం పోశారని, సంగీత దర్శకుడు తమన్తోపాటు, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టారని, స్త్రీలందరూ గర్వపడేలా, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా సరస్వతి ఉంటుందని అన్నారు.

సరస్వతి లాంటి కథను కచ్ఛితంగా చెప్పాలన్నారు సీనియర్ నటుడు శరత్కుమార్. ధర్యాన్నిచ్చే సినిమా సరస్వతి అని, వరలక్ష్మిని చూసి ఒక స్త్రీగా గర్విస్తున్నానని రాధిక శరత్కుమార్ అన్నారు. మనసులో ముద్రించుకుపోయిన కథ ఇదని ప్రియమణి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత పూజా శరత్కుమార్, నికోలాయ్ సచ్దేవ్, ఈటీవీ విన్ ప్రతినిథి నితిన్ చక్రవర్తి, నటి సిమ్రాన్, డైరెక్టర్ నందినీరెడ్డి, సప్తగిరి కూడా మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.















