ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా – Telugu Association of North America) ఆధ్వర్యంలో రైతులకు సహాయంగా “రైతు కోసం” కార్యక్రమంను కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం – పొనుకుమాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.10 లక్షల విలువైన బ్యాటరీ ఆధారిత వ్యవసాయ స్ప్రేయర్లు మరియు తార్పాలిన్లను 350 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించగా, తానా అధ్యక్షుడు డా. నరేన్ కోడాలి మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు తమ స్వస్థల రైతుల కోసం ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. తానా సంస్థ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.ఈ సందర్భంగా మాట్లాడిన తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడుతూ తానా సంస్థ ఎప్పుడూ తెలుగు ప్రజలకు సేవ చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. రైతుల శ్రమ దేశానికి పునాది అని పేర్కొంటూ, రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పరికరాలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపడతామని చెప్పారు. రైతులకు అవసరమైన సహాయం అందించేందుకు తానా ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో పొనుకుమాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడు సుంకర రాజేష్, మాజీ గ్రామ అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, గ్రామ పెద్దలు అళ్ళ సత్యనారాయణ, కొంజేటి సాంబశివరావు మరియు ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తానా అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాటరీ ఆధారిత స్ప్రేయర్లు వ్యవసాయ పనుల్లో రైతులకు ఎంతో ఉపయోగపడతాయని, తార్పాలిన్లు పంటను వర్షం మరియు ఇతర వాతావరణ ప్రభావాల నుండి రక్షించడంలో సహాయపడతాయని తెలిపారు.రైతులకు అండగా నిలిచి వ్యవసాయ రంగానికి సహకరించాలనే లక్ష్యంతో తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.


















